నంద్యాలలో బాలయ్య-పవన్ వస్తే వైసీపీకే ప్లస్
ఏపీలో నంద్యాల ఎన్నికల్లో గెలవకపోతే పరువు పోతుందన్న భయంతో అక్కడ అధికార పార్టీ గెలిచేందుకు చేయని ప్రయత్నం అంటూ లేదు. ఈ క్రమంలోనే ఇక్కడ మంత్రులు, ఎమ్మెల్యేలను మోహరించిన చంద్రబాబు ఇప్పుడు సినీ స్టార్స్ బాలయ్య, పవన్కళ్యాణ్ను కూడా రంగంలోకి దింపుతున్నారట. వీరిద్దరు త్వరలోనే నంద్యాలలో ప్రచారం చేయనున్నారు.
బాలయ్య రెండు రోజులు, పవన్ ఒక రోజు నంద్యాల టౌన్లో రోడ్ షోలు చేస్తారట. వాస్తవంగా చూస్తే వీరిద్దరి ప్రచారం టీడీపీ కంటే వైసీపీకే ప్లస్ అవుతుందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్న బాలయ్య తన సొంత నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదు. అక్కడ బాలయ్య కనపడడం లేదని జనాలు ధర్నాలు చేయడం కూడా జరుగుతోంది.
ప్రస్తుతం హిందూపురంలో బాలయ్యపై తీవ్ర అసంతృప్తి ఉంది. ఈ విషయం అందరికి తెలుసు. ఇప్పుడు ఆ బాలయ్య తన సొంత నియోజకవర్గాన్ని గాలికి వదిలేసి నంద్యాల వచ్చి ఇక్కడ జనాలను టీడీపీకి ఓట్లేయమంటే జనాలు ఎలా వేస్తారన్న ప్రశ్నలు వస్తున్నాయి.
ఇక పవన్ ఎప్పుడు మాట్లాడతాడో ? ఎప్పుడు సైలెంట్ అవుతాడో ? కూడా ఎవ్వరికి తెలియదు. పవన్ను జనాలు అస్సలు నమ్మడం లేదు. జనసేనను ఓ రాజకీయ పార్టీగా చాలా మంది గుర్తించడం లేదు. నిన్నటికి నిన్న టీడీపీని తిట్టిన పవన్ ఇప్పుడు ఆ పార్టీకి ఎలా ప్రచారం చేస్తాడన్న ప్రశ్న కూడా వస్తోంది. ఏదేమైనా పవన్, బాలయ్య నంద్యాలలో టీడీపీకి ప్రచారం చేస్తే అది ఆ పార్టీకి ఏమోగాని వైసీపీకి ప్లస్ అయ్యేలా ఉంది.