ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై వరుసగా సర్వేల మీద సర్వేలు చేయించేస్తున్నారు. తక్కువ మార్కులు వచ్చిన వాళ్లకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఉండదని వార్నింగ్లు కూడా ఇస్తున్నారు. తాజాగా నంద్యాల బై పోల్ టెన్షన్లో ఉన్న ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు.
తాజాగా చంద్రబాబు జరిపించిన సర్వేలో వైసీపీకి వచ్చే ఎన్నికల్లో కేవలం 30 సీట్లు మాత్రమే వస్తాయని తేలిందట. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా టీడీపీ ఎమ్మెల్యేలకు మంగళవారం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమని చెప్పిన చంద్రబాబు వైసీపీకి అంత సీన్ లేదని ఆయన తేల్చేశారు.
ఇక పనితీరు సరిగా లేకుండా, తన సర్వేలో తక్కువ మార్కులు వచ్చిన వారి విషయంలో తాను ఉపేక్షించేది లేదని బాబు చెప్పారు. ఇక 2019 ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఎన్నికల హామీలను మూడేళ్లలోనే 90 శాతం అమలు చేసిన విషయాన్ని కూడా ప్రజలకు తెలియజెప్పనున్నారు. ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లాలన్నారు.
ఇక ఓ వైపు టీడీపీపై భారీగా వ్యతిరేకత వ్యక్తమవుతోందని, నంద్యాలలో కూడా హోరాహోరీగా పోరు ఉంటుందని విశ్లేషకులు చెపుతుంటే చంద్రబాబు వైసీపీకి కేవలం 30 సీట్లే వస్తాయని చెప్పడం చూస్తుంటే ఆయన సర్వే ఎలా జరిగి ఉంటుందబ్బా ? అన్న సందేహాలు వస్తున్నాయి.