చైనాలో పూజలు అందుకుంటున్న…”భారతీయుడి విగ్రహం”
ప్రస్తుతం భారత్ చైనాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. భారత సరిహద్దుల్లో అక్రమంగా ప్రవేశిస్తూ భారతీయ సైనికులను అన్యాయంగా పొట్టన పెట్టుకుంటున్న చైనా పై ప్రతి ఒక్క భారతీయుడు, అలాగే చైనాను వ్యతిరేకిస్తున్న దేశాలన్నీ గుర్రుగానే ఉన్నాయి. అంతేకాదు భారత ప్రభుత్వం చైనా కి సంబంధించిన యాప్స్ పై నిషేధం విధించడంతో చైనా కూడా భారత్ పై అసహనం వ్యక్తం చేస్తూ అదును కోసం ఎదురు చూస్తోంది. ఇదిలా ఉంటే భారతీయ వ్యక్తి కి చైనా ప్రజలు విగ్రహం కట్టించి అతని పేరిట మ్యూజియం సైతం ఏర్పాటు చేసి ఆరాధిస్తున్నారు. ఈ కధ పాతదే అయినా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ అవుతోంది మరి ఆ భారతీయుడు విగ్రహం కథ ఏమిటో మనమూ చూద్దాం..
భారతీయులు స్వాతంత్రం కోసం పోరాటం చేస్తున్న సమయమది. అదే సమయంలో చైనాలో జపాన్ ఆక్రమణకి వ్యతిరేకంగా భారీ స్థాయిలో పోరాటం జరుగుతోంది. ఈ సమయంలో ఎంతోమంది చైనా సైనికులు సరైన వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్న తరుణంలో చైనా భారత్ ను వైద్య సాయం చేయాల్సిందిగా ప్రాధేయపడింది. దాంతో అప్పటి భారత నాయకులు నెహ్రూ, నేతాజీ ,సుభాష్ చంద్రబోస్ కలిసి అఖిలభారత చైనా నిధి పేరుతో విరాళాలు సేకరించి, చైనాకు ఒక వైద్య బృందాన్ని పంపించారు..
ఐదుగురు వైద్యులతో కూడిన ఈ బృందంలో 28 ఏళ్ల ద్వారకనాథ్ శాంతారామ్ కొట్నీస్ అనే యువ వైద్యుడు కూడా ఉన్నారు. ఈ బృందం చైనాలో అడుగుపెట్టిన వెంటనే తమ సహాయక చర్యలు ప్రారంభించింది కొట్నీస్ ఈ బృందంలో చురుకుగా పాల్గొంటూ చైనీయులు త్వరగా కోలుకునేలా నిద్రాహారాలు కూడా పక్కనపెట్టి నిరంతరం చైనా సైనికులకు వైద్యసేవలు అందించారు. ఒక్కోసారి ఆయన వైద్య సేవలు నిర్విరామంగా మూడు రోజులపాటు ఒక్క క్షణం కూడా అలసట లేకుండా జరిగేవి. సుమారు నాలుగేళ్ల పాటు అవిశ్రాంతంగా చైనా సైనికులకు సేవలు చేశారు ఈ క్రమంలోనే చైనీయులకు ప్రేమాభిమానాలు కొట్నీస్ పై రోజు రోజుకి పెరిగిపోయాయి. అతడు చైనాలో ప్రతీ ఒక్క చైనీయుడి మన్ననలు పొందారు. ఈ క్రమంలోనే కొట్నీస్ చైనా భాష నేర్చుకోవడం, చైనా లో రాయడం మొదలు పెట్టాడు. తన వద్ద పనిచేస్తున్న నర్సును ప్రేమించి పెళ్లి చేసుకున్న కొట్నీస్ దంపతులకు పుట్టిన బిడ్డకు “భారత్ చైనా” అనే పేరు వచ్చేలా పేరు పెట్టుకున్నాడు. నిద్రాహారాలు లేకుండా పనిచేయడంతో కోట్నీస్ ఆరోగ్యం రోజురోజుకూ క్షీణించడం మొదలు పెట్టి చివరకు అతడు మృతి చెందాడు. అతడి మరణాన్ని చైనీయులు తట్టుకోలేకపోయారు.తమ దేశీయుడు కాకపోయినా కొట్నీస్ తమకి అందించిన సేవలని మర్చిపోలేని చైనీయులు అతడికి విగ్రహాన్ని కట్టించారు. అంతేకాదు కొట్నీస్ వాడిన వైద్య పరికరాలు, పెన్నులు ఇలా ప్రతీ ఒక్క వస్తువుని జతచేర్చి మ్యూజియంగా మలిచారు. చైనాలో ప్రతీ ఏటా జరిగే ఓ పండుగ రోజున కొట్నీస్ విగ్రహానికి కూడా పూజలు చేస్తారు చైనీయులు…