జగన్ సీఎం – హరికృష్ణ డిప్యూటీ సీఎం…బంపర్ ఆఫర్
ఏపీలో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేందుకు అధికార టీడీపీ, విపక్ష వైసీపీ మధ్య రాజకీయం ఎత్తులు, పై ఎత్తులతో సాగుతోంది. మరోసారి సీఎం అయ్యేందుకు చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేస్తుంటే, చంద్రబాబును ఎలాగైనా సీఎం కుర్చీ నుంచి గద్దె దింపేందుకు వైసీపీ అధినేత వైఎస్.జగన్ ఎన్నో ప్రయత్నాలు పన్నడంతో పాటు వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే జగన్ టీడీపీకి కీలకమైన ఎన్టీఆర్ వారసులను టార్గెట్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి.
కొద్ది రోజుల క్రితం కేంద్ర మాజీ మంత్రి, ఎన్టీఆర్ కుమార్తె దగ్గుపాటి పురందేశ్వరి వైసీపీలోకి వెళతారన్న వార్తలు వచ్చాయి. పురందేశ్వరి వైసీపీలోకి వెళితే గుంటూరు లేదా విజయవాడ నుంచి ఆమె ఎంపీగా పోటీ చేయవచ్చన్న టాక్ వచ్చింది. అలాగే పురందేశ్వరి – వెంకటేశ్వరరావు దంపతుల కుమారుడు దగ్గుపాటి చెంచురామ్ను వైసీపీ నుంచి వారి సొంత నియోజకవర్గం పర్చూరు నుంచి పోటీ చేయిస్తారని కూడా వార్తలు వచ్చాయి.
ఇదిలా ఉంటే జగన్ ఇప్పుడు ఎన్టీఆర్ కుమారుడు నందమూరి హరికృష్ణను తన వైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నాలు స్టార్ట్ చేసినట్టు ఏపీ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. హరికృష్ణ పార్టీలోకి వస్తే ఆయనకు డైరెక్టుగా డిప్యూటీ సీఎం ఇస్తానని జగన్ రాయభారం పంపినట్టు వార్తలు వస్తున్నాయి. హరికృష్ణ కోరుకుంటే కృష్ణా జిల్లాలో ఆయన కోరుకున్న నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే సీటు ఇవ్వడం లేదా ఆయన్ను ఎమ్మెల్సీ చేసి డిప్యూటీ సీఎంను చేస్తానని జగన్ ఆఫర్ ఇచ్చినట్టు టాక్.
ఈ ఆఫర్కు హరికృష్ణ ఎలా స్పందించాడన్నది మాత్రం తెలియడం లేదు. ఇదే క్రమంలో హరికృష్ణలో ఉన్న అసంతృప్తిని చల్లార్చడానికే చంద్రబాబు ఆయన్ను టీటీడీ చైర్మన్ చేస్తారని టీడీపీ వర్గాల నుంచి వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ వారసుడు హరికృష్ణ ఇప్పుడు అటు జగన్, ఇటు చంద్రబాబు మధ్యలో పెద్ద సంచలన కేంద్ర బిందువుగా మారారు. ఆయన పొలిటికల్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూడాలి.