ఆ ‘ఎంపీ’కి చుక్కలు చూపిస్తోన్న కవిత..
ఆయన తెలంగాణ రాజకీయాల్లో ఓ దిగ్గజం. సమైక్య రాష్ట్రంలో ఆయన పీసీసీ అధ్యక్షుడిగా ఉండగానే కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. అధిష్టానం దృష్టిలో ఆయన మాటకు ఎంతో విలువ ఉండేది. అలాంటి కాంగ్రెస్ సీనియర్ నేత ప్రాంతీయ పార్టీ అయిన టీఆర్ఎస్లోకి జంప్ చేసేశారు. పార్టీలో చేరినప్పుడు ఆయనకు కేసీఆర్ ఏకంగా రెడ్ కార్పెట్ వేశారు. పార్టీలోకి వచ్చాక ఆయన్ను రాజ్యసభ సభ్యుడిగా కూడా పంపారు. జాతీయ స్థాయిలో పేరున్న సదరు నేత మాట ఇప్పుడు ఆయన సొంత జిల్లాలో కాదు, సొంత నియోజకవర్గంలో కూడా చెల్లుబాటు కావడం లేదట.
ఆయన ఎవరో టీఆర్ఎస్ ఎంపీ డి.శ్రీనివాస్. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా గుర్తింపు పొంది ఒక దశలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా ప్రచారం అయిన ధర్మపురి శ్రీనివాస్ ఇప్పుడు టీఆర్ఎస్లో అస్సలు ఇమడ లేకపోతున్నట్టు తెలుస్తోంది. కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కవిత కారణంగానే డీఎస్ పార్టీలో తనకు సరైన గౌరవం దక్కడం లేదని బాధపడుతున్నట్టు టీఆర్ఎస్ ఇంటర్నల్ పాలిటిక్స్లో చర్చలు నడుస్తున్నాయి.
నిజామాబాద్ జిల్లాలో గతంలో డీఎస్ ఓ రేంజ్లో చక్రం తిప్పారు. ఇప్పుడు ఆయన మాటకు అక్కడ ఎవ్వరూ విలువ ఇవ్వడం లేదట. అక్కడ ఎంపీగా ఉన్న కవితతో పాటు ఆమె కనుసన్నల్లో ఉంటోన్న ఎమ్మెల్యేల రాజ్యమే ఇప్పుడు అక్కడ నడుస్తోంది. దీంతో డీఎస్ అంత సీనియర్ అయ్యి ఉండి కూడా ఖాళీగా ఉంటున్నారట. ఢిల్లీలో ఆయన వీలున్నప్పుడల్లా కాంగ్రెస్ పెద్దలతో చర్చల్లోనే ఉంటున్నారు.
ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ పలకరించినప్పుడో ఆయనతో ప్రత్యేకంగా పని ఉన్న సందర్భంలోనే డీఎస్ ఆయన్ను కలుస్తున్నారే తప్ప, కేసీఆర్తో కూడా ఆయన ముభావంగా ఉంటున్నారని తెలుస్తోంది. ఇక టీఆర్ఎస్, కేసీఆర్ను విపక్షాలు ఎన్ని విమర్శలు చేస్తున్నా కూడా డీఎస్ నుంచి ఎలాంటి రిప్లే ఉండడం లేదు. ఇక వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు సంజయ్కు ఎమ్మెల్యే టిక్కెట్ అడిగినా కేసీఆర్ నుంచి స్పందన లేకోవడంతో డీఎప్ పార్టీలో పూర్తి నిర్వేదంతో ఉన్నట్టు తెలుస్తోంది.