ఏపీలో బీజేపీ-టీడీపీ పొత్తు బ్రేకప్పై కొద్ది రోజులుగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ వార్తలకు ఊతమిచ్చేలా మరో వార్త హల్చల్ చేస్తోంది. 2014లో ఏపీలో జరిగిన ఎన్నికల్లో ఒకరి నొకరు నోళ్లు నొప్పులు పుట్టేలా పొగుడుకుని పోటీకి దిగిన బీజేపీ, టీడీపీల మధ్య ఇప్పుడు సైలెంట్ వార్ నడుస్తోంది. వెంకయ్య అవుట్ అవ్వడంతో ఇప్పుడు టీడీపీతో పొత్తు వద్దనే వాళ్లే ఎక్కువైపోయారు.
ముఖ్యంగా 2019లో తిరిగి హస్తిన పీఠాన్ని దక్కించుకోవాలని కంకణం కట్టుకున్న ప్రధాని నరేంద్ర మోడీ మిత్రపక్షాలను కూడా నిర్దాక్షిణ్యంగా తొక్కేసేందుకు ఏ మాత్రం సంకోచించడం లేదు. అవసరమైతే తిరిగి వారితోనే జట్టుకడుతున్నారు. బిహార్లో తాజాగా జరిగిన సంఘటనే ఇందుకు నిదర్శనం.
ఇక సమర్థులు, తనకు పోటీ వచ్చే వారిని కూడా మోడీ వ్యూహాత్మకంగా పక్కన పెట్టేస్తున్నారు. వెంకయ్య ఇప్పటికే అయిపోగా ఇప్పుడు బాబు వంతు వచ్చింది. ఈ క్రమంలోనే టీడీపీని క్రమక్రమంగా తొక్కేసే ప్లాన్ వేసిన మోడీ ముందుగా త్వరలో జరిగే కేబినెట్ ప్రక్షాళనలో టీడీపీకే చెందిన మంత్రి సుజనా చౌదరిని పక్కన పెట్టేసి షాక్ ఇస్తారని తెలుస్తోంది.
ఇప్పటికిప్పుడు చంద్రబాబుతో వైరం పెట్టుకోకూడదనేది కూడా మోడీ వ్యూహంలో భాగమేనంటున్నారు. ప్రస్తుతం తమ పార్టీ నేతలు బాబు జమానాలో మంత్రులుగా ఉన్నందున టైం కోసం మోడీ వేచి చూస్తున్నారని చెబుతున్నారు. ఎన్నికల సమయానికి పూర్తిగా తెగతెంపులు చేసుకుని ఏపీలో గెలుపు గుర్రం ఎక్కే మరోపార్టీతో జట్టుకట్టి మరిన్ని సీట్లలో గెలవాలని కాషాయ నేతలు స్కెచ్ గీశారట. మరి ఏం జరుగుతుందో చూడాలి.