దటీజ్ పీతల సుజాత…పార్టీ పట్టించుకోకపోయినా…??
పీతల సుజాత తెలుగుదేశం పార్టీలో కీలక నాయకురాలిగా, ఎంతో కమిట్మెంట్ ఉన్న మహిళ నేతగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడమే కాదు, మంత్రిగానూ ఆమె తన మార్క్ చూపించారు. ఆ తరువాత కొన్ని కొన్ని గ్రూపు రాజకీయాల కారణంగా మంత్రిపదవి పోగొట్టుకున్నా, ఆమె ఎప్పుడూ టీడీపీకి వీరవిధేయురాలిగానే ఉంటూ వచ్చారు. ఆమె రాజకీయ ప్రస్థానం టీడీపీ నుంచే మొదలవ్వడంతో, ఆమె పార్టీపై అభిమానం చూపిస్తూ, టీడీపీ కష్టకాలంలో ఉన్న సమయంలోనూ పార్టీకి అండగా నిలబడుతూ, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వస్తున్నారు. చింతలపూడి ఎమ్మెల్యే గా పనిచేసిన సమయంలో ఆమె పరిపాలనా తీరు నియోజక వర్గ ప్రజలను ఎంతో ఆకట్టుకుంది. కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాలవారు పీతలను అభిమానించే వారు. దీంతో ఆమెకు మరోసారి అక్కడి నుంచి అవకాశం కల్పిస్తారని భావించినా, ఆమెకు నిరాశే ఎదురయ్యింది. అదే సమయంలో ఆమెకు వైసీపీ నుంచి ఆఫర్ లు వచ్చినా ఆమె తిరస్కరించి కష్టమైనా, నష్టమైనా టీడీపీలోనే అన్నట్టుగా ఉండిపోయారు. కానీ
ప్రస్తుతం ఆమెను గుర్తించడం లో అధిష్టానం విఫలం అయ్యిందో ఏమో తెలియదు కానీ ఆమెకు ఇటీవల ప్రకటించిన పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గాల ఇంచార్జి పదవుల్లో ఆమెకు అవకాశం దక్కలేదు. పోనీ త్వరోలోనే జరగబోయే టీడీపీ రాష్ట్ర కమిటి లో అయినా ఆమెకు అవకాశం దక్కుతుందా అనే సందేహాలు ఇప్పుడు ఆమె అనుచరుల్లో నెలకొన్నాయి. అయినా ఆమె అవేవి పట్టించుకోకుండానే తనదైన శైలిలో క్షేత్ర స్థాయిలో బలం పెంచుకునే పనిలో నిమగ్నం అయ్యారు., ప్రజా సమస్యలపై తనదైన శైలిలో ప్రభుత్వాన్ని నిలదీస్తూ, తన సామాజిక వర్గంలో మరింత పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తూ చాపకింద నీరులా జిల్లాల్లో తన పట్టుపెంచుకుంటూ వస్తున్నారు. ఇదిలాఉంటే గత కొంత కాలంగా పీతల ఏపీ ప్రభుత్వ పనితీరుపై, ప్రజా సమస్యలపై దృష్టి సారించారు..
ఏపీ ప్రభుత్వం దళితులపై చూపుతున్న నిర్లక్ష్య ధోరణి ని ఎప్పటికప్పుడు ఎండగడుతున్నారు. దళితలు ఓట్ల ద్వారా అధికారంలోకి వచ్చిన వైసీపీ పార్టీ, ఆ పార్టీ అధినేత, దళితులను చిన్న చూపు చూస్తున్నారని పీతల ఆవేదన వ్యక్తం చేశారు. అయినంపూడి లో దళిత మహిళపై జరిగిన దాడికి చలించిపోయిన పీతల సుజాత ప్రభుత్వం ఆమె పట్ల చూపించిన వైఖరిని బహిరంగంగా విమర్శించారు. అలాగే ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దళితులపై శిరోముండన ఘటనలపై పీతల ఘాటుగానే స్పందించారు. దళితుల ద్వారా అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి వారిని కట్టుబానిసలుగా చూస్తున్నారంటూ దళితుల పక్షాన నిలబడ్డారు, నిలదీస్తున్నారు.
టీడీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యే గా, మంత్రిగా, సొంత జిల్లా పశ్చిమ గోదావరిలో సీనియర్ పొలిటీషియన్ గా పేరొందిన పీతల సుజాత ఎంతో కమిట్మెంట్ గా పార్టీ కోసం కష్టపడి పనిచేశారని, మంత్రి పదవి నుంచీ పార్టీ తప్పించినా ఎక్కడా పార్టీని విమర్శించకుండా, చంద్రబాబు ఆదేశాల ప్రకారం నడుచుకున్నారని, పార్టీపై , చంద్రబాబు పై పీతలకు ఉన్న విధేయతకు ఇదే నిదర్సనమని అంటున్నారు ఆమె అభిమానులు, పార్టీ కార్యకర్తలు. త్వరలో జరగబోయే రాష్ట్ర కమిటీలో పీతలకు కీలక పదవి అప్పగించాలని టీడీపీ శ్రేణులు, అభిమానులు, ముఖ్యంగా ఆమె సొంత సామాజిక వర్గ దళిత నాయకులు ఆశిస్తున్నారు. ఇదిలాఉంటే టీడీపీ లో మోస్ట్ సీనియర్ నేతలుగా చెప్పుకుంటున్న వాళ్ళు ప్రభుత్వాన్ని నిలదీయడానికి జంకుతున్న సమయంలో పీతల సుజాత దళితులకు, జిల్లా ప్రజలకు అండగా నిలబడటంతో పాటు ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.