“లైగర్” తెచ్చిన తిప్పలు….స్టేషన్ మెట్లెక్కిన “దర్శకుడు పూరీ”
పూరీ జగన్నాథ్దర్శకత్వంలో రిలీజ్ అయ్యి ఘోరాతి ఘోరంగా ప్లాప్ అయిన సినిమా లైగర్. పూరీ సినిమాలలో ఉండే డిఫరెంట్ టేకింగ్ ఈ సినిమాకు లేదంటూ ఫ్యాన్స్ చాలా ఫీల్ అయ్యారు. అయితే ఎన్ని సినిమాలు ప్లాప్ అయినా సరే ఏదో ఒక హిట్ కొట్టేసి మళ్ళీ ట్రాక్ లోకి రావడం పూరికి అలవాటే. అయితే లైగర్ సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఎన్నడూ లేని విధంగా బయ్యర్లు పూరి ని తమ సొమ్ములు తిరిగి ఇవ్వాలంటూ గడిచిన కొన్ని రోజలుగా డిమాండ్ చేస్తున్నారు, ఈ విషయం అందరికి తెలిసిందే. ఈ విషయంలో సీనియర్ నటులు, దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సైతం పూరికి మద్దతుగా నిలిచారు. అయితే తాజాగా ఇదే విషయంపై పూరి స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వచ్చింది.
లైగర్ కు దర్శక, నిర్మాత గా వ్యవహరించిన పూరికి బయ్యర్ల కు మధ్య వివాదం రోజు రోజుకు ముదిరి పాకాన పడుతోంది. తమకు నష్టపరిహారం ఇవ్వాలంటూ పూరి జగన్నాథ్ ఇంటిముందు ధర్నాకు దిగుతామని బయర్లు బెదిరిస్తున్న విషయం విదితమే. ఈ పరిణామాలతో పూరి జగన్నాథ్ తనకు తన కుటుంబానికి ప్రాణహాని ఉందని డిస్ట్రిబ్యూటర్స్ పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
నిన్నటి రోజు రాత్రి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో పూరి కేసు నమోదు చేశారు. వరంగల్ డిస్ట్రిబ్యూటర్ శ్రీను అలాగే ఫైనాన్షియర్ శోభన్ బాబులు తన కుటుంబం పై దాడి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని పూరి తన ఫిర్యాదులో తెలిపారు. తన కుటుంబాన్ని మానసికంగా, శారీరకంగా వేధించేందుకు ఇతర వ్యక్తులతో ఒప్పందం కుదుర్చుకునే ఆలోచన చేస్తున్నట్టుగా తమకు అనుమానం ఉందని పూరి పోలీసులకు తెలిపారు తన నుండి చట్ట విరుద్ధంగా డబ్బు వసూలు చేసేందుకు బ్లాక్మెయిలింగ్ వేధింపులు చేస్తున్నారని తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలంటూ పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్ లో పేర్కొన్నారు. కాగా పూరి లైగర్ వివాదం పై స్టేషన్ మెట్లు ఎక్కడం సినిమా ఇండస్ట్రీ లో సంచలనంగా మారింది