కళాతో వార్…ఎర్రన్న ఫ్యామిలీ కీలక డెసిషన్…
తెలుగు రాజకీయాల్లో దివంగత కేంద్ర మాజీ మంత్రి కింజారపు ఎర్రన్నాయుడుకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టెక్కలి నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఎర్రన్నాయుడు ఢిల్లీకి వెళ్లి కేంద్రమంత్రిగా అక్కడ రాజకీయాలను శాసించే స్థాయి వరకు వెళ్లాడు. ఎర్రన్న ఆకస్మిక మరణం తర్వాత ఆయన తనయుడు రామ్మోహన్నాయుడు పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ వయస్సులోనే ఎంపీ అయ్యాడు.
ఇక ఎర్రన్న తమ్ముడు అచ్చెన్నాయుడు బాబు కేబినెట్లో మంత్రిగా ఉన్నారు. ఇక ఎర్రన్న వియ్యంకుడు ఆదిరెడ్డి అప్పారావు టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇక శ్రీకాకుళం జిల్లాలో గత మంత్రివర్గ ప్రక్షాళనకు ముందు వరకు జిల్లాలో అచ్చెన్న హవా నడిచింది. అచ్చెన్న చెప్పినట్టే అంతా జరిగింది. ఇక ప్రక్షాళనలో కిమిడి కళా వెంకట్రావుకు కూడా మంత్రి పదవి రావడంతో అప్పటి నుంచి వీరిద్దరి మధ్య వార్ స్టార్ట్ అయ్యింది.
జిల్లాలో మంత్రులు కళా వెంకట్రావు, అచ్చెన్నాయుడు మధ్య తీవ్రస్థాయిలో తలెత్తాయి. కళావెంకట్రావుకు మంత్రి పదవి ఇవ్వడాన్ని తొలినుంచి ఇష్టపడని అచ్చెన్నాయుడు అప్పటి నుంచి కొంత అసంతృప్తిగా ఉంటూ వస్తున్నారు. తనపై కళా లోకేశ్కు, బాబుకు లేనిపోనివి చెప్పి తన ఇమేజ్ డ్యామేజ్ చేశారని అచ్చెన్న ఫైర్ అవుతున్నారు.
జిల్లాలో టీడీపీకి పెద్ద బ్రాండ్ ఇమేజ్ అయిన ఎర్రన్న ఫ్యామిలీపై కళా బాబు, లోకేశ్కు లేనిపోనివి చెపుతున్నారన్న టాక్ కూడా వచ్చేసింది. వాస్తవంగా ఎర్రన్న ఫ్యామిలీ ముందునుంచి టీడీపీనే నమ్ముకుని ఉంది. కళా మధ్యలో పీఆర్పీలోకి వెళ్లి వచ్చారు. ఇలా పార్టీలు మారిన వారికి అధిష్టానం ప్రయారిటీ ఇస్తుండడంతో ఎర్రన్న ఫ్యామిలీ తీవ్ర అసంతృప్తితో ఉంది. ఈ విషయాన్ని వారు బాబు, లోకేశ్ వద్దే తాడోపేడో తేల్చుకునేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం. ఏదేమైనా కళాతో వార్ నేపథ్యంలో ఎర్రన్న ఫ్యామిలీ ఏదో ఒక కీలక నిర్ణయం తీసుకుంటుందన్న టాక్ కూడా నడుస్తోంది.