ఏపీలో ఎన్నికల టైమ్ దగ్గర పడుతోన్న కొద్ది పశ్చిమగోదావరి జిల్లా టీడీపీ పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి. చాలా నియోజకవర్గాల్లో ఆశావాహులు లెక్కకు మిక్కిలిగా తెర మీదకు వస్తున్నారు. ముఖ్యంగా రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో అయితే పార్టీ అధిష్టానానికి కుప్పలు తెప్పలుగా తమ అభ్యర్థిత్వం పరిశీలించాలంటూ అప్లికేషన్లు అందుతున్నాయి. ఈ క్రమంలోనే పశ్చిమగోదావరి జిల్లాలో ఎక్స్సైజ్ శాఖ మంత్రి కేఎస్ జవహర్ ఎమ్మెల్యేగా ఉన్న కొవ్వూరు నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే టీవీ. రామారావుకు టీడీపీ టిక్కెట్ ఇవ్వాలంటూ కొందరు ఆయన్ను తెరమీదకు తీసుకు వస్తున్నారు. జిల్లాలో ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలైన చింతలపూడి, గోపాలపురం, కొవ్వూరులో చాలా మంది ఆశావాహులు పోటీ పడుతున్నా వాస్తవంగా చూస్తే ఈ మూడు సీట్లను చంద్రబాబు మార్చే ఛాన్స్ లేదని తెలుస్తోంది.
ఇక ఎన్నికల వేళ ఇప్పుడు తెర మీదకు వచ్చి హడావిడి చెయ్యడం రామారావుకే చెల్లింది. గతంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయనకు చెందిన నర్సింగ్ కాలేజ్లో విద్యార్థినిల మీద లైంగిక వేధింపులు జరిగినట్టు కూడా వార్తలు వచ్చాయి. ఇది అప్పటిలోనే టీడీపీకి పెద్ద మాయని మచ్చలా మిగిలింది. ఆ నాడే చంద్రబాబు, రామారావుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్ల పాటు రామారావు తీరుతో విసిగివిసిగి వేసారిపోయిన ప్రతీ కొవ్వూరు టీడీపీ సామాన్య కార్యకర్త గత ఎన్నికల్లో రామారావుకు టిక్కెట్టు ఇస్తే చిత్తు చిత్తుగా ఓడిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. గత ఎన్నికల్లో చంద్రబాబు రామారావును నిర్థాక్షణ్యంగా పక్కన పెట్టేశారు. పార్టీ టిక్కెట్ దక్కకపోవడంతో పార్టీ అధిష్టానంతో పాటు చంద్రబాబుపైన తీవ్ర విమర్శలు చేసిన రామారావు చంద్రబాబు అంతు చూస్తానని కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అంతటితో ఆగకుండా ఇప్పుడు ఎవరైతే ఆయనను సపోర్ట్ చేస్తున్నారో వాళ్లందరిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన రామారావు… ఇప్పటి రాజమండ్రి ఎంపీ మురళీ మోహన్ను సైతం చిత్తు చిత్తుగా ఓడిస్తానని తనకు టిక్కెట్ దక్కకుండా ఆయనే చేశారని పెద్ద పెద్ద పరుషమైన పదాలు వాడారు. నేడు అదే రామారావుకు గతంలో ఆయన ఇబ్బంది పెట్టినవాళ్లు సపోర్ట్ చెయ్యడం మరీ విచిత్రం. ఇక ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో రామారావు తిరిగి పార్టీలోకి వచ్చినా ఆయన పేరు కనీసం కొవ్వూరు నియోజకవర్గంలోనే కాదు జిల్లాలో ఏ నియోజకవర్గంలోను కాదు కదా చివరకు పార్టీలో నామినేటెడ్ పదవికి కూడా ప్రపోజల్స్లో కూడా లేకపోవడం ఆయనకు పార్టీలో ఎలాంటి స్థానం ఉందో చెప్పకనే చెపుతోంది.
కొవ్వూరులో మంత్రి కేఎస్. జవహర్ చాలా బలంగా ఉన్నారు. ఉపాధ్యాయుడిగా కెరియర్ ఆరంభించి ఎమ్మెల్యేగా అయిన వెంటనే మూడేళ్లకే మంత్రి అయిన జవహర్ అటు పార్టీతో పాటు ఇటు ప్రభుత్వానికి ఎంతో పేరు తెచ్చారు. అయితే స్థానికంగా నియోజకవర్గంలో టీడీపీలోని ఓ వర్గం ఆయనతో అంటీముట్టనట్టు వ్యవరిస్తుంది. విచిత్రం ఏమిటంటే ఈ వర్గం గతంలో టీడీపీ నుంచి గెలిచిన టీవీ. రామారావును అప్పటిలో తీవ్రంగా విభేదించింది. ఇప్పుడు అదే వర్గం జవహర్తోనూ వైరం పెట్టుకుంది. ఇప్పుడు అదే వర్గం విచిత్రంగా గతంలో తాము విభేదించిన టీవీ. రామారావును తెర మీదకు తీసుకురావడం విశేషం. వాస్తవంగా చూస్తే టీవీ. రామారావుకు చంద్రబాబు దగ్గర ఏ మాత్రం మంచి మార్కులు లేవు. కొవ్వూరు నియోజకవర్గంలో టీడీపీని టోటల్గా బ్రష్టు పట్టించిన ఘనత టీవీఆర్దే. స్థానిక టీడీపీ నాయకుల సపోర్ట్తో చంద్రబాబు టీవీ. రామారావుకు టిక్కెట్ ఇస్తే 2009 ఎన్నికల్లో భారీ మెజార్టితో ఘన విజయం సాధించిన ఆయన అతి తక్కువ టైమ్లోనే తాను టిక్కెట్ ఇప్పించిన నాయకులకే ఎదురు తిరిగారు.
చివరకు నియోజకవర్గంలో రిలీజ్ సినిమాలు వెయ్యాలన్నా థియేటర్ల వాళ్లు ఆయనకు కప్పం కట్టాల్సిన పరిస్థితి వచ్చిందన్నది అప్పటి మేటర్. రెవెన్యూ, ఆర్ఎన్వీ, హౌసింగ్ ఇలా ప్రతీ విభాగాన్ని వదలకుండా ఆయన ముక్కు పిండి డబ్బులు వసూల్ చేసినట్టు అప్పటిలో ఆరోపణలు వచ్చాయి. గోదావరి తీరాన ఉన్న కొవ్వూరులో ఇసుక కుంభకోణం సరే సరి. ప్రస్తుతం ఆయన నివాసం ఉంటున్న ఇల్లు కూడా నిబంధనలు అతిక్రమించి కట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆయన అనుమతులకు మించి పై అంతస్తులు వేసారన్నది బహిరంగ రహస్యం. ఆయన ఇంటి నిర్మాణం కూడా ఓ కంపెనీని బెదిరించి కట్టుకన్నారని టీడీపీ వాళ్ల ఆరోపణలు.
1983 నుంచి చూసుకుంటే 2014 వరకు కొవ్వూరు నియోజకవర్గంలో గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేల్లో పెండ్యాల వెంకటకృష్ణ బాబు, కేవీ. రామారావు, కేఎస్. జవహర్ ఈ ముగ్గుర్లో టీడీపీని నియోజకవర్గంలో పాతాళానికి తొక్కేసిన ఘనత సైతం టీవీ. రామారావుకే చెందుతుంది అనడంలో సందేహమే లేదని జిల్లా టీడీపీ నాయకత్వానికి తెలుసు. చివరకు వికలాంగులు సైతం రకరకాల పనుల నిమిత్తం ఆయన వద్దకు వెళ్లినప్పుడు వారి నుంచి కూడా కమీషన్లు దండుకునే చరిత్ర ఆయనకే చెందుతుందని అప్పటిలో టీడీపీ నాయకులు తీవ్రమైన విమర్శలు చేశారు. అలాంటి టీవీ. రామారావును ఇప్పుడు జవహర్ను వ్యతిరేఖిస్తున్న ఓ చిన్నాచితక గ్యాంగ్ తెర మీదకు తీసుకురావడం మరీ హాస్యాస్పదం. ఏదేమైనా కొవ్వూరులో వచ్చే ఎన్నికల్లో టీడీపీ సీటు తిరిగి జవహర్కే దక్కడం పక్కా. ప్రస్తుతం నియోజకవర్గంలో వైసీపీ ఆయనకు పోటీ ఇచ్చే స్థితిలో కూడా లేకపోవడంతో మళ్ళీ కొవ్వూరు గెడ్డపై ఎగిరేది టీడీపీ జెండానే… గెలిచేది జవహరే అన్నది మాత్రం క్లియర్గా తెలుస్తోంది.