రవిప్రకాష్ మెడకి మరో ఉచ్చు…!!!
టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ పై మరొక కేసు నమోదు అయ్యింది. ఇప్పటికే ఫోర్జరీ కేసుతో సతమతమవుతున్న రవిప్రకాష్ తాజాగా టీవీ9 లోగోతో పాటు తానూ సొంత వెబ్ ఛానెల్ మోజో టీవీకి దొంగచాటుగా బదిలీ చేశారు అనే ఆరోపణలు వెల్లివెత్తాయి. అందుకు గాను ఏబీసీపీఎల్ డైరెక్టర్ కౌశిక్రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఐపీసీ 457, 420, 409, 406, 20(బి) సెక్షన్ల కింద రవిప్రకాష్ పై కేసులు నమోదు చేశారు.
పోలీసులకి అందిన ఫిర్యాదు ప్రకారం. రవిప్రకాశ్, ఎంవీకేఎన్ మూర్తి, హరికిరణ్ చేరెడ్డి కలిసి టీవీ9 లోగోలను మోజోటీవీ యాజమాన్య సంస్థ మీడియా నెక్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు కేవలం రూ.99 వేలకు అమ్మేశారు. 2018 మే 22న కుదిరిన ఒప్పందం ప్రకారం. వీటిని అమ్ముతున్నామంటూ 2018 డిసెంబరు 31న డీడ్ ద్వారా వాటిని రాసిచ్చేశారు. లోగోలు అమ్మినందుకు టీవీ9 యాజమాన్య సంస్థ ఏబీసీపీఎల్కు డబ్బులు అందాలి.
అందుకు సాక్ష్యంగా 2019 జనవరి 22న 99,000 రూపాయలను నెక్ట్స్ ఇండియా నుంచి ఏబీసీపీఎల్కు బదిలీ చేశారు. కోట్ల రూపాయలు విలువ చేసే లోగోని అక్రమంగా దురుద్దేశపూర్వకంగా, కంపెనీకి నష్టం కలిగించే విధంగా రవిప్రకాష్ బదిలీ చేశారని కౌశిక్రావు ఫిర్యాదు చేశారు.