నంద్యాలలో శిల్పా చక్రపాణి రెడ్డిపై కాల్పులు…
నంద్యాలలో ఎన్నికల వేడి ఇంకా తగ్గనేలేదు, అప్పుడే మరొక అలజడి మొదలైంది.మరోసారి రాయలసీమలో ఫ్యాక్షన్ పడగవిప్పింది.నంద్యాల ఉపఎన్నికల పోలింగ్ నిన్నటితో ముగిసిపోయి రిజల్ట్స్ కోసం వేచిచూస్తున్న సమయంలో వైసీపి అభ్యర్ధి శిల్పా సోదరుడు మాజీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి పై హత్యాయత్నానికి పాల్పడ్డారు.
సరిగ్గా మూడు నెలలక్రితం పత్తికొండకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ చెరుకులపాడు నారాయణరెడ్డిపై టీడీపీ వర్గీయులు దాడి చేసి అతి కిరాతకంగా నరికి చంపారు.ఈ ఉదంతం మరువక ముందే శిల్పా చక్రపాణి రెడ్డి మీద ఈ హత్యాయత్నం నంద్యాలలో కలకలం రేపుతోంది
వివరాలలోకి వెళ్తే. నంద్యాల కౌన్సిలర్ చింపింగ్ బాషా కుటుంబసభ్యుడొకరు చనిపోవడంతో, ఈరోజు అతని అంత్యక్రియలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇరు పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. ఒకరి వాహనాలు ఒకరికి ఎదురెదురు పడటం,శిల్పా వర్గీయులు టీడీపి నేత మధు కారుని పక్కకు తీయమని అడగటంతో ఇరువర్గాలమధ్య గొడవ జరిగింది. మధు ఆవేశంతో చక్రపాణిరెడ్డి లక్ష్యంగా ఐదు రౌండ్ల కాల్పులు జరిపాడు.
ఈ ఘటనపై వెంటనే చక్రపాణిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు వెంటనే స్పందించక ఆలస్యంగా వచ్చారని చక్రపాణిరెడ్డి పేర్కొన్నారు. ఉప ఎన్నికలో ఓటమి భయంతోనే ఇలాంటి ఘటనలకు పాల్పడ్డారని విమర్శించారు. మేం ఎప్పుడు శాంతినే కోరుకుంటున్నామని, ఈ ఘటనపై ఈసీకి, పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చక్రపాణిరెడ్డి తెలిపారు. ఈ ఘటనపై వైఎస్ఆర్సీపీ నేతలు భగ్గుమంటున్నారు.