వైసీపీలోకి ‘ దగ్గుపాటి ‘ దంపతులు… జగన్ ఆఫర్లు ఇవే
ఏపీ సీఎం చంద్రబాబుకు తోడల్లుడు.. ఎన్టీఆర్ పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారా? విపక్ష నేత జగన్ చెంతకు చేరనున్నారా ? దీనిపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయా ? అంటే అవుననే ఆన్సరే వస్తోంది. 2019 ఎన్నికలే టార్గెట్గా దూసుకుపోతోన్న జగన్ ప్రస్తుతం పలు కీలక నాయకులపై వల వేస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీలో ఉండి రాజకీయంగా తీవ్ర అసంతృప్తితో ఉన్న దగ్గుపాటి దంపతులను తమ వైపునకు తిప్పుకునే ప్రయత్నాలు జగన్ చేసినట్టు సమాచారం.
ఈ క్రమంలోనే ఉండవల్లి అరుణ్కుమార్, కెవిపి.రాంచంద్రరావు దగ్గుపాటి దంపతులను వైసీపీలోకి తీసుకువచ్చేందుకు మంత్రాంగం నడుపుతున్నట్టు తెలుస్తోంది. తాజాగా దగ్గుబాటి.. పోలవరం ప్రాజెక్టు పరిశీలన కోసం వచ్చారు. ఈ సమయంలో ఆయన మాజీ ఎంపీ ఉండవల్లిని వెంటేసుకుని తిప్పుకొన్నారు. వీరిద్దరి మధ్య చర్చలు జరిగాయని కూడా తెలుస్తోంది.
తమతో పాటు తమ కుమారుడి పొలిటికల్ ఫ్యూచర్ను దృష్టిలో ఉంచుకుని జగన్ పార్టీలోకి వెళ్లడమే మంచిదనే అభిప్రాయానికి వెంకటేశ్వరరావు వచ్చినట్టు సమాచారం. బీజేపీలో పురందేశ్వరి ఉన్నా ఆమెకు ప్రయారిటీ ఉండడం లేదు. దీని వెనక కూడా చంద్రబాబు హస్తంపై ఆమె పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇక తాజాగా దగ్గుపాటి దంపతులు వైసీపీలోకి వెళితే పురందేశ్వరికి కోస్తాలో ఆమె కోరుకున్న నియోజకవర్గం నుంచి ఎంపీ సీటుతో పాటు ఆమె తనయుడు చెంచురామ్ లేదా భర్త వెంకటేశ్వరరావుకు పర్చూరు అసెంబ్లీ సీటుపై హామీ వచ్చినట్టు సమాచారం.