కాకినాడలో “తమ్ముళ్ళ” వీరంగం..
కాకినాడలో పోరు తుది దశకి చేరుకుంటున్న సమయంలో,ఈరోజు కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్న సమయంలో టీడీపి కార్యకర్తలు తమ అసహనాన్ని ప్రదర్శించారు. టీడీపీ కార్యకర్తలు తప్పుడు ప్రచారం చేస్తూ, కరపత్రాలు పంపిణీ చేస్తుండగా వైఎస్సార్సీపీకి చెందిన మాజీ కార్పొరేటర్ బసవా చంద్రమౌళి అనుచరులు వారిని అడ్డుకున్నారు. అది సహించలేని టీడీపి కార్యకర్తలు గొడవలకు దిగి సుమారు అరగంటపాటు వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద వీరంగం చేశారు. అంతేకాకుండా 40వ డివిజన్ వైఎస్సార్ సీపీ ఎన్నికల కార్యాలయంపై సోమవారం రాత్రి టీడీపీ కార్యకర్తలు ,ఆ టిడీపి డివిజన్ అభ్యర్ధి సుంకర లక్ష్మి ప్రసన్న భర్త సాగర్ ఆయన అనుచరులు రాత్రి 11 గంటల సమయంలో పార్టీ కార్యాలయం వద్దకు వచ్చి కుర్చీలు విరగొట్టారు.
మహిళల పట్ల కూడా దురుసుగా ప్రవర్తించారు. విషయం పోలీసులకు తెలియడంతో అక్కడికి చేరుకుని ఇరు వర్గాలకు సర్ది చెప్పారు. సుమారు 100 మంది టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ బసవా చంద్రమౌళి మాట్లాడుతూ తమ పార్టీ నాయకులపై కరపత్రాలతో దుష్ప్రచారం చేస్తుంటే అడ్డుకున్నామని చెప్పారు. తప్పును ప్రశ్నిస్తే ఎదురు దాడికి దిగారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపి నాయకులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని మాపై దాడులకి పాల్పడుతున్నారని వాపోయారు.