డ్రగ్స్ దందాలో కేటీఆర్ బామ్మర్ది
తెలంగాణలో కలకలం రేకెత్తిస్తోన్న డ్రగ్స్ వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వం మెడకు చుట్టుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ఈ మాఫియాకు టీఆర్ఎస్కు లింకులు ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. ప్రధాన ప్రతిపక్షం విమర్శల జాబితాలోకి తాజాగా మరో పక్షమైన టీడీపీ సైతం చేరింది. డ్రగ్స్ దందాపై తెలంగాణ టీడీపీ కార్యానిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు మంత్రి కేటీఆర్ బావమరిది డ్రగ్స్ దందాతో సంబంధాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు.
ఈ ఇష్యూలో చిన్న చిన్న వాళ్లకు నోటీసులు ఇచ్చిన ప్రభుత్వం పెద్దలను ఎందుకు వదిలేసిందని ఆయన విమర్శించారు. కేటీఆర్ బంధుమిత్రులతో పాటు, కేటీఆర్ బావమరిది పబ్లకు ఎందుకు నోటీసులు ఇవ్వడం లేదని రేవంత్ నిలదీశారు. తాను పబ్లపై గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోని పోలీసులు ఇప్పుడు ఎందుకు హడావిడి చేస్తున్నారంటూ ఆయన ప్రశ్నించారు.
డ్రగ్స్ విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ – నార్కోటిక్ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలకు ప్రభుత్వం ఎందుకు లేఖలు రాయడం లేదని ఆయన ప్రశ్నించారు. డ్రగ్స్ పేరుతో యజమానులను బెదిరించి డబ్బులు వసూలు చేసుకోవడానికే కేసులను వారి వద్దే పెట్టుకున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా కేంద్ర దర్యాప్తు సంస్థలకు డ్రగ్స్ కేసును అప్పగించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.