నంద్యాలలో చేతులెత్తేస్తోన్న టీడీపీ…
నంద్యాల విషయంలో తెలుగుదేశం పార్టీకి ఒక్కో ఎదురుదెబ్బ తగులుతోంది. గత వారం రోజుల్లో ఇక్కడ ఆ పార్టీకి చెందిన ముగ్గురు కీలక వ్యక్తులు వైసీపీలో చేరిపోయారు. ఇప్పుడు టీడీపీకి చెందిన ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి కూడా పార్టీ మారిపోయారు. ఉప ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీకి ఇది ఎదురుదెబ్బే. శిల్పామోహన్ రెడ్డి వైకాపాలోకి చేరిపోయి ఆ పార్టీ నుంచి పోటీ చేస్తుండగా, చక్రపాణి రెడ్డి తెలుగుదేశాన్ని వీడి వైకాపాను చేరాడు.
శిల్పా చక్రపాణిరెడ్డి పార్టీ మారతారన్న వార్తలతో టీడీపీ లీడర్లు రంగంలోకి దిగి ఆయన్ను బుజ్జగించేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. బాబుకు సన్నిహితుడు అయిన సీఎం రమేశ్ తో సహా మరికొందరు నేతలున్నారు. వీళ్లంతా వెళ్లి శిల్పా చక్రపాణి రెడ్డిని ప్రాధేయపడ్డారు. ఎన్నికల ముందు పార్టీని వీడితే చాలా నష్టమని చెప్పినా ఆయన మాత్రం వారి మాట వినకుండా పార్టీ జంప్ అయిపోయారు.
ఇక శిల్పా చక్రపాణిరెడ్డి పార్టీ మారడం వల్ల పార్టీకి ప్రయోజనం లేదని అనుకుంటే వాళ్లు అంతలా బుజ్జగించేవారు కాదన్న చర్చలు నడుస్తున్నాయి. ఆయనకు నంద్యాల్లో ఎంతో కొంత బలం ఉంది కాబట్టే.. టీడీపీ రాయబారులు వెళ్లారు. అలాగే ఉప ఎన్నిక ముందు పార్టీలోకి చేరిక అంటే..వైకాపాలో ఆత్మవిశ్వాసం పెంచే అంశమే ఇది.
శిల్పా చక్రపాణి రెడ్డి వైకాపాలోచేరడం ఖాయమైంది. జగన్ మోహన్ రెడ్డి నంద్యాల పర్యటన నేపథ్యంలో చక్రపాణి రెడ్డి ఆయన ఆధ్వర్యంలో వైకాపా తీర్థంపుచ్చుకోనున్నారు. వరుస దెబ్బలతో నంద్యాలలో టీడీపీ ఎన్నికలకు ముందే చేతులెత్తేసేలా కనపడుతోంది.