టీవీ-9 అమ్మకం షురూ.. డీల్ ఇదే
తెలుగు న్యూస్ మీడియాలో సంచలనం అయిన టీవీ-9ను సేల్ పెట్టారంటూ గత ఆరు నెలలుగా తెలుగు మీడియాలో ఇంటర్నల్గా వార్తలు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సంచలనాలకు వేదిక అయిన రవిప్రకాశ్ నేతృత్వంలో నడుస్తోన్న టీవీ-9 ఎలక్ట్రానిక్ మీడియాలో ఓ ట్రెండ్ సెట్ చేసింది. గతేడాదే టీవీ-9ను అమ్ముతున్నట్టు వార్తలు వచ్చినా తర్వాత అవి సైలెంట్ అయ్యాయి.
ఇక ఇప్పుడు దీనిని ఓ జాతీయ మీడియా సంస్థ కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోన్నట్టు తెలుస్తోంది. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ అండ్ కోకి మద్దతు పలుకుతున్న రిపబ్లిక్ టీవీ యాజమాన్యమే దీనిని కూడా కొనుగోలు చేస్తున్నట్టు తెలుస్తోంది. వీరి మధ్య డీల్ కూడా రూ.500 కోట్లని తెలిసింది.
టైమ్స్ నౌలో ఎంతో పాపులర్ అయిన అర్నాబ్ గోస్వామి రిపబ్లిక్ టీవీలో వాటాదారుగా ఉన్నారు. అదేవిధంగా రాజ్యసభ సభ్యుడు రాజీవ్ చంద్రశేఖర్ కూడా రిపబ్లిక్ టీవీలో భాగస్వామిగా ఉన్నారు. దక్షిణాదిలో బీజేపీ బలపడాలని చూస్తోంది. ఈ క్రమంలోనే టీవీ-9 కొనుగోలు జరుగుతోంది. రిపబ్లిక్ టీవీ ఇప్పుడు బీజేపీకి బాగా ఉపయోగ పడుతోంది.
మోడీపై ప్రత్యేక ప్రేమతో పాటు కేంద్రాన్ని వెనకేసుకుంటూ వస్తోంది. ఇప్పుడు ఇదే టీం టీవీ-9 సాయంతో తెలుగు రాష్ట్రాల్లో బీజేపీని భుజానికెత్తుకోవాలని చూస్తోంది. మరి ఈ డీల్ ఎక్కడ తెగుతుందో ? ఎక్కడ ఓకే అవుతుందో ? చూడాలి.