ఆ మాఫియాకు ఏపీ మంత్రి అండ..
ఏపీలో అధికార టీడీపీలో చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలు తీవ్రమైన అవినీతి ఆరోపణల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నారు. ఈ క్రమంలోనే మరో మంత్రిపై ఏకంగా ఆయిల్ మాఫియా ఆరోపణలు వస్తున్నాయి. ఏపీలో వైసీపీ అధినేత జగన్పై దూకుడు విమర్శలు చేసే వాళ్లలో నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రి సోమిరెడ్డి ముందుంటారు. ఎన్నికల్లో వరుసగా ఓడిపోతూ వస్తోన్న సోమిరెడ్డికి చంద్రబాబు గత ఎన్నికల్లో మంత్రి పదవి ఇచ్చారు.
గతంలో మంచిపేరే తెచ్చుకున్న సోమిరెడ్డి ఈ సారి మాత్రం చేతికి బాగా పని చెప్పేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. జిల్లాలో వ్యాపారాలు, బదిలీలు, అనుచరులకు కాంట్రాక్టులు కట్టబెట్టడంలో ఇలా ఆయనపై చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే కృష్ణపట్నం రేవులో క్రూడాయిల్ మాఫియాకు మంత్రి సోమిరెడ్డి అండదండలు అందిస్తున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది.
ఆయిల్ సరఫరా చేసే లారీల నుంచి ఆయన కమీషన్లు తీసుకుంటున్నారనే ఆరోపణలు జిల్లాలో వినిపిస్తున్నాయి. ఈ ఆయిల్ మాఫియాపై కొంత మంది పారిశ్రామికవేత్తలు ముఖ్యమంత్రి చంద్రబాబును స్వయంగా కలిసి వాస్తవాలు వివరించడమే గాక మంత్రి సోమిరెడ్డి ప్రమేయం ఉందని ఫిర్యాదు చేశారు.
దీంతో చంద్రబాబు సోమిరెడ్డికి వార్నింగ్ ఇవ్వాలని భావిస్తున్నారట. అయితే ఈ విషయం ఆయనకు ముందుగానే తెలియడంతో నంద్యాలలో జగన్ను, వైసీపీని పదే పదే టార్గెట్ చేస్తూ బాబు దృష్టిపై తనమీద పడకుండా ఉండేందుకు ప్లాన్లు వేస్తున్నారట.