వికటించిన ఆకర్ష్: వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్సీ…
ఏపీలో తన పార్టీని బలోపేతం చేసుకునేందుకు విపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను వరుసపెట్టి సైకిల్ ఎక్కించుకున్న సీఎం చంద్రబాబుకు ఇప్పుడు వరుసగా షాకులు మీద షాకులు తగులుతున్నాయి. ఆయన పార్టీ బోలోపేతం కోసం చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ వికటిస్తోంది. నంద్యాల ఉప ఎన్నిక సాక్షిగా ఆయనకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది.
ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బతో నంద్యాలకు చెందిన మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి… టీడీపీకి కోలుకోలేని దెబ్బ కొడుతూ వైసీపీలో చేరిపోయారు. శిల్పా మోహన్రెడ్డి పార్టీ మారడంతో ఆయన సోదరుడు… మొన్నటిదాకా టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగిన ఆ పార్టీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి ఇప్పుడు ఎటువైపు మొగ్గుతారన్న అంశంపై పెద్ద చర్చే నడుస్తోంది. అయితే తన సోదరుడు పార్టీ మారినా కూడా తాను మాత్రం పార్టీ మారేది లేదంటూ చక్రపాణి రెడ్ది చెబుతూ వస్తున్నారు.
ఈ క్రమంలో నేడు నంద్యాల పర్యటనకు రెండో దఫా వెళ్లిన చంద్రబాబుకు శిల్పా చక్రపాణిరెడ్డి పెద్ద షాక్ ఇచ్చారు. బాబు పర్యటనకు ఆయన దూరంగా ఉన్నారు. దీనిపై మంత్రి అఖిలప్రియను ఆయన ఆరా తీయగా… ఆయనకు షాకింగ్ సమాధానం వినిపించిందట. గత కొంతకాలంగా శిల్పా చక్రపాణిరెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారని చెప్పారట.
ఇక బాబు ఆయన గురించి ఆరా తీయగా ఆయన సోదరుడి ద్వారా వైసీపీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. తనను టీడీపీ వాళ్లు కలుపుకోలేకపోవడంతో పాటు అవమానాలకు గురి చేయడంతో విసిగిపోయిన చక్రపాణిరెడ్డి కూడా సోదరుడి బాటలోనే వెళ్లాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.