జనసేన+టీడీపీ పొత్తు ఖాయం… డీల్ ఏంటి..!
ఏపీలో 2019 ఎన్నికలకు మరో 20 నెలల టైం ఉండగానే ఇక్కడ రాజకీయం మంచి ఆసక్తిగా మారింది. ఓ వైపు మిత్రపక్షాలుగా ఉన్న టీడీపీ-బీజేపీ మధ్య రోజు రోజుకు గ్యాప్ పెరుగుతోంది. బీజేపీని నమ్ముకుంటే లాభం లేదని డిసైడ్ అయిన చంద్రబాబు ఇప్పుడు జనసేన వైపు మొగ్గు చూపుతున్నట్టు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే పవన్ ఈ రోజు చంద్రబాబుతో భేటీలో వచ్చే ఎన్నికల్లో కలిసి పనిచేసే అంశంపై కూడా చర్చ జరిగినట్టు మీడియా వర్గాల ద్వారా తెలుస్తోంది.
గత ఎన్నికల్లో పవన్ జనసేన పార్టీ పెట్టినా పోటీ చేయకుండా టీడీపీ+బీజేపీ కూటమికి సపోర్ట్ చేశాడు. అయితే ఆ తర్వాత ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ ఏపీకి అన్యాయం చేయడంతో బీజేపీపై పవన్ ఓ రేంజ్లో గళమెత్తాడు. టీడీపీపై కూడా సుతిమెత్తని విమర్శలు చేశాడు. ఇక ఇప్పుడు ఏపీకి మరింత అన్యాయం చేయడంతో పాటు బీజేపీ వైసీపీతో కలిసి వెళ్లే సిగ్నల్స్ ఇవ్వడంతో పవన్-బాబు అలెర్ట్ అయినట్టే తెలుస్తోంది.
తాజాగా ఈ రోజు పవన్-బాబు భేటీలో వచ్చే ఎన్నికల్లో కలిసి పనిచేసే అంశంతో పాటు నంద్యాల నియోజకవర్గంలో మద్దతు అంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. పవన్కు దివంగత భూమా దంపతులతో మంచి అనుబంధం ఉంది. వీళ్లు ప్రజారాజ్యంలో కలిసి పనిచేశారు. నంద్యాలలో కాపు, బలిజల ఓట్లు 30వేలు ఉంటే.. యువ ఓట్లు భారీగానే ఉన్నాయి. అభ్యర్థి గెలుపునకు ఈ ఓట్లు కీలకం కానుండటంతో పవన్ అక్కడ టీడీపీకి మద్దతు ఇచ్చేందుకు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.
ఇక వచ్చే ఎన్నికల్లో టీడీపీ+జనసేన కలిసి పోటీ చేసినా జనసేన ఎన్ని సీట్లలో పోటీ చేయాలి ? అనే అంశంపై తర్వాత నిర్ణయం తీసుకోనున్నట్టు కూడా తెలుస్తోంది. ఏదేమైనా 2019లో జనసేన టీడీపీతో కలిసి వెళ్లడం దాదాపు ఖాయమైనట్టే తెలుస్తోంది