టీడీపీలో వైసీపీ హవా..
వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలు ఇక్కడ అధికార పార్టీలో క్రమక్రమంగా పట్టు పెంచుకుంటూ పోతున్నారు. ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నవారికంటే కొత్తగా పార్టీలోకి వచ్చిన వీరి ఆధిపత్యమే ప్రస్తుతం నడుస్తోంది. మంత్రి వర్గ విస్తరణలో ఏకంగా నలుగురు జంపింగ్లకు మంత్రి పదవులు దక్కాయి. జంపింగ్ జపాంగ్లకు భారీగా మంత్రి పదవులు ఇచ్చిన చంద్రబాబు మిగిలిన జంపింగ్ జపాంగ్లకు కూడా ఏదో ఒక పదవి ఇస్తున్నారు.
వైసీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కు నిన్ననే వక్ఫ్ బోర్డు ఛైర్మన్ పదవి దక్కిన సంగతి తెలిసిందే. ఇదే బాటలో మరికొందరు వైసీపీ నేతలు కూడా ఉన్నట్లు సమాచారం. ఇదే బాటలో తూర్పుగోదావరి జిల్లా జడ్పీ ఛైర్మన్ పదవిని కూడా వైసీపీ నేత దక్కించుకున్నారు. వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కొంతకాలం క్రితం టీడీపీలో చేరారు. నెహ్రూ పార్టీలో చేరినప్పుడే ఆయనకు మంత్రి పదవి వస్తుందని అందరూ అనుకున్నారు.
అయితే నెహ్రూకు మంత్రి పదవిని ఇవ్వకపోవడంతో ఇప్పుడు ఆయన తనయుడికి ఏకంగా జడ్పీ చైర్మన్ ఇస్తున్నారు. ఇందుకోసం ప్రస్తుత జడ్పీ చైర్మన్ నామన రాంబాబును పదవి నుంచి దించేసి మరీ నెహ్రూ తనయుడు నవీన్కు తూర్పు జడ్పీ పీఠం ఇస్తున్నారు. ఇక నంద్యాలలో ఇటీవలే పార్టీలో చేరిన నౌమాన్కు సైతం కార్పొరేషన్ పదవి కట్టబెట్టారు. ఓవరాల్గా ఎలా చూసుకున్నా చంద్రబాబు సొంత పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నవాళ్లకంటే వైసీపీ నుంచి వచ్చిన జంపింగ్ జపాంగ్లకే కీలక పదవులు కట్టబెడుతున్నారు.