వైసీపీలోకి పశ్చిమ మాజీ మంత్రి..!
ఏపీలో వచ్చే ఎన్నికల వేళ విపక్ష వైసీపీలోకి వలసల పర్వం జోరుగా ఉండే వాతావరణం కనిపిస్తోంది. నిన్నటి వరకు అధికార టీడీపీలోకి విపక్ష వైసీపీ నుంచి వలసలో జోరందుకున్నాయి. ఇప్పుడు సీన్ మారింది. అధికార టీడీపీలో అసంతృప్తులు, టిక్కెట్లు రావని డిసైడ్ అయిన వారు వైసీపీలోకి జంప్ చేసేస్తున్నారు.
ఇక ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి తన పదవికి రాజీనామా చేసి మరీ వైసీపీలోకి వెళ్లిపోయారు. ఇక పార్టీ మారే వారిలో టీడీపీ ఎమ్మెల్సీలు కరణం బలరాం, రామసుబ్బారెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు మాజీ మంత్రి, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే రావెల కిషోర్బాబు పేరు వైసీపీ జంపింగ్ లిస్టులో ఉండగా ఇప్పుడు మరో మాజీ మంత్రి పేరు కూడా లైన్లో ఉంది.
ఆ మాజీ మంత్రి ఎవరో కాదు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మాజీ మంత్రి వట్టి వసంత్కుమార్. పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు నుంచి 2004, 2009లో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వసంత్ గత ఎన్నికల తర్వాత స్టేట్ డివైడ్ అవ్వడంతో పోటీ చేయకుండా అలాగే ఉండిపోయారు.
ప్రస్తుతం కాంగ్రెస్లో ఉంటూ తటస్థంగా ఉన్న వసంత్ వచ్చే ఎన్నికల నేపథ్యంలో వైసీపీలోకి జంప్ చేస్తాడని తెలుస్తోంది. ఆయన వైసీపీలో చేరి ఉంగుటూరు నుంచి ఆ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని వార్తలు జిల్లాలో వినిపిస్తున్నాయి.