వైసీపీకి ఎంపీలుగా టాలీవుడ్ స్టార్స్…
ఏపీ రాజధాని అమరావతిని విపక్ష వైసీపీ అధినేత జగన్ బాగా టార్గెట్ చేస్తున్నారు. ఈ ప్రాంతంలో వైసీపీ వీక్గా ఉంది. పీకే సర్వే రిపోర్టులోనే ఇదే అంశం తేటతెల్లమైంది. దీంతో జగన్ ఇక్కడ విజయం సాధించేందుకు టాలీవుడ్ ప్రముఖులను రంగంలోకి దించుతున్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. కీలకమైన విజయవాడ, గుంటూరు లోక్సభ సీట్లలో విజయం సాధించేందుకు జగన్ షాకింగ్ ఎత్తుగడలు వేస్తున్నారు.
ఈ రెండు జిల్లాల్లో ఉన్న కమ్మ సామాజికవర్గాన్ని ఆకట్టుకునేందుకు జగన్ ఈ రెండు సీట్లను కూడా టాలీవుడ్లో టాప్ ఫ్యామిలీలకు చెందిన, కమ్మ వర్గం వ్యక్తులకే ఇస్తున్నారని సమాచారం. ఇలా చేయడం ద్వారా ఈ రెండు ఎంపీ సీట్లతో పాటు ఈ రెండు జిల్లాల్లో ఎక్కువగా అసెంబ్లీ స్థానాలను గెలుచుకునే అవకాశం కూడా ఉంటుంది.
ఈ రెండు సీట్లలో నందమూరి ఫ్యామిలీ నుంచి ఒకరిని బరిలోకి దించాలని జగన్ యత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్ తనయుడు నందమూరి హరికృష్ణను విజయవాడ నుంచి బరిలోకి దింపాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన్ను పార్టీలోకి తీసుకువచ్చే బాధ్యతను కొడాలి నానికి అప్పగించినట్టు తెలుస్తోంది.
ఇక గుంటూరు ఎంపీగా మహేష్బాబు బాబాయ్, ఘట్టమనేని ఆదిశేషగిరిరావును గుంటూరు నుంచి లోక్సభకు బరిలో దింపవచ్చని తెలుస్తోంది. ఇక ఇదే సీటుకు వైసీపీ ఎంపీగా కింగ్ నాగార్జున పేరు కూడా వినిపించిన సంగతి తెలిసిందే. ఏదేమైనా టాలీవుడ్లో రెండు బలమైన ఫ్యామిలీలకు చెందిన ఈ ఇద్దరితో ఈ ప్రాంతంలో టీడీపీకి చెక్ పెట్టాలన్న జగన్ వ్యూహాలు ఎంత వరకు ఫలిస్తాయో ? చూడాలి.