ఏపీలో అధికార టీడీపీ-మిత్రపక్ష బీజేపీ మధ్య ఇప్పటికే పొరా పొచ్చలు వచ్చేశాయి. ఇక నంద్యాల, కాకినాడ ఉప ఎన్నికల
సాక్షిగా ఇప్పుడు ఈ రెండు పార్టీల మధ్య విబేధాలు మరింత తీవ్రతరమయ్యాయి. నంద్యాల ఉప ఎన్నికల సాక్షిగా ఇప్పుడు ఈ రెండు పార్టీల మధ్య గ్యాప్ మరింత పెరిగింది. తొలి నుంచి నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో బీజేపీకి టీడీపీ స్థానం కల్పించలేదు.
నంద్యాలలో ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉండటంతో బీజేపీ నేతలు ప్రచారానికి వస్తే తమకు ఓట్లు పడవేమోనన్న సందేహంతో నంద్యాలకు బీజేపీని రానివ్వలేదు టీడీపీ నేతలు. ఇక బీజేపీ కండువా లేకుండా ఆ పార్టీ వాళ్లను ఇక్కడ ప్రచారానికి రావాలని చెప్పడం మరో షాక్. కర్నూలు జిల్లా బీజేపీ నేతలను కూడా నంద్యాలలోకి రానివ్వలేదు. ఒకవేళ వైశ్య, బ్రాహ్మణ ఓటర్లను కలుసుకోవడానికి రావాలంటే జెండా, కండువా లేకుండా రావాలని టీడీపీ నేతలు షరతులు విధించారని కర్నూలు జిల్లా బీజేపీ అధ్యక్షుడు బహిరంగంగానే విమర్శలు చేశారు.
ఇక కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీకి 9 వార్డులు కేటాయించిన టీడీపీ అక్కడ రెబల్ అభ్యర్థులతో నామినేషన్ వేయించింది. దీనిపై కూడా బీజేపీ నేతలు మండిపడుతున్నారు. మిత్రధర్మాన్ని టీడీపీ విస్మరించిందని ఏపీ బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఏదేమైనా ఈ రెండు ఎన్నికల సాక్షిగా చంద్రబాబు చేతిలో బీజేపీకి ఘోర అవమానమే మిగిలింది.