నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అంచనాలను మించి పోలింగ్ జరగడంతో ఎక్కువ పోలింగ్ ఎవరికి లాభం తక్కువ పోలింగ్ ఎవరికి మేలు వంటి లెక్కలు చాలా వున్నాయి. ఎవరి లెక్కల్లో వారు మునిగి తేలుతున్నారు. ఇక గత నెల రోజులుగా ప్రచారం హోరులో రణగణ ధ్వనుల మధ్యలో నలిగిపోయిన నంద్యాల ఇప్పుడు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటోంది.
ఈ తీర్పు మూడేళ్ల రాజకీయ పరిణామాలకు కీలకం కానుంది. నంద్యాల ఉప ఎన్నిక ఫలితం. యథాతథంగా రాష్ట్రమంతా ఇదే పరిస్థితి ఉంటుంది.. అనేయలేం కానీ, మూడేళ్ల తర్వాత జరిగిన ఒక్కగానొక్క ఉప ఎన్నిక కాబట్టి.. ఇది ఒక రకంగా రెఫరండం లాంటిదే, జడ్జిమెంట్ లాంటిదే అని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు.
భారీ ఓటింగ్ జరగడం సానుభూతి ఎఫెక్టే తామే గెలుస్తామని టీడీపీ అంటుంటే, కాదు కాదు ప్రభుత్వ వ్యతిరేక ఓటుతోనే ఇంత పోలింగ్ జరిగిందని..గెలుపు తమదే అని వైసీపీ చెపుతోంది. ఇక నంద్యాల పరిణామాలను బట్టి తెలుగుస్టార్.న్యూస్ కామ్ విశ్లేషణలో పోలింగ్ శాతం భారీగానే ఉన్నా మెజారిటీ మాత్రం అత్యంత స్వల్పంగానే ఉండబోతోంది.
నంద్యాల టౌన్లో ఓటింగ్ తక్కువ జరగడం టీడీపీకి మైనస్. ఇక నంద్యాల రూరల్పై ఇరు పార్టీలు ఆశలు పెట్టుకున్నాయి. ఇక గోస్పాడులో ఏకంగా 90 శాతం పోలింగ్ జరగడం, ఇక్కడ వైసీపీకి ఏకపక్షంగా పోలింగ్ జరిగిందన్న టాక్ రావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఫుల్ జోష్ ఉంది.
రుణమాఫీ, డ్వాక్రారుణమాఫీ వంటి ఫ్యాక్టర్లు టీడీపీ ని దారుణంగా దెబ్బతీశాయి. ఇక కులాల పరంగా చూస్తే ఏ వర్గంలోనూ సాలిడ్ గా ఒకవైపే ఓట్లు పడలేదు, అన్ని ఓట్లూ అన్ని వైపులా పడ్డాయి. ఒకటి మాత్రం నిజం పోలింగ్కు ముందు వరకు పైచేయి సాధించిన టీడీపీ పోలింగ్ రోజు మాత్రం అంచనాలు అందుకోలేదు. మరి నంద్యాల ఓటరు తుది తీర్పు ఎలా ఉంటుందో ? చూడాలి.