నమ్ముకున్నోళ్లకే దెబ్బేస్తోన్న బాబు..
తెలుగుదేశం అధినేత చంద్రబాబు వైఖరి ఇప్పుడు సొంత పార్టీ వాళ్లలోనే పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఆయన్ను ఎంతో నమ్ముకున్న వాళ్లకే దెబ్బేస్తున్నారని పార్టీలో చాలా మంది తీవ్ర అసహనంతో రగిలిపోతున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన కరణం బలరాం చంద్రబాబును సీఎం చేసేందుకు ఎంతో కృషి చేశారు. కట్ చేస్తే ఇప్పుడు ఆయన రాజకీయ ప్రత్యర్థి గొట్టిపాటి రవికుమార్ను పార్టీలో చేర్చుకున్న బాబు కరణంను ముప్పుతిప్పులు పెడుతున్నారు.
ఈ విషయంలో కరణం ఎంత మెత్తుకున్నా బాబు మాత్రం ఆయన్ను పట్టించుకోవడం లేదు. ఆయన పార్టీలో ఉండాలా ? వెళ్లాలా ? అని అల్టిమేటం కూడా జారీ చేసే వరకు పరిస్థితి వచ్చేసింది. ఇక కడప జిల్లా జమ్మలముడుగులో మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి కుటుంబ పార్టీ కోసం తమ సొంత కుటుంబ సభ్యులనే కోల్పోయింది. ఇప్పుడు ఆయన చిరకాల రాజకీయ ప్రత్యర్థి ఆదినారాయణరెడ్డిని పార్టీలో చేర్చుకున్న చంద్రబాబు రామసుబ్బారెడ్డికి నరకం చూపిస్తున్నారు.
రామసుబ్బారెడ్డిని ఆదినారాయణరెడ్డి అన్ని విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇక 2009 ఎన్నికల్లో కడప జిల్లాలో వైఎస్ను ఎదిరించి గెలిచిన ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డిని పక్కన పెట్టిన బాబు గత ఎన్నికల్లో ఆయన మీద ఓడిపోయిన వరదరాజులరెడ్డికి సీటు ఇచ్చారు. లింగారెడ్డి పార్టీ కోసం ఎంతో త్యాగం చేశారు.
ఇక పార్టీ పుట్టినప్పటి నుంచి పార్టీనే నమ్ముకున్న గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ఇప్పుడు పక్కన పెట్టేశారు. ఇక విశాఖలో గత ఎన్నికలకు ముందు మంత్రి అయ్యన్న వద్దని చెపుతున్నా వినకుండా గంటా గ్యాంగ్ను పార్టీలో చేర్చుకుని వారికి సీట్లు ఇవ్వడంతో పాటు గంటాకు మంత్రి పదవులు ఇచ్చారు. ఇప్పుడు గంటా వల్ల అటు పార్టీకి, ఇటు ప్రభుత్వానికి తీరని నష్టం కలుగుతోందని అయ్యన్న వాపోతున్నారు. ఇలా బాబును, టీడీపీని నమ్ముకున్న వారికి ఇప్పుడు టీడీపీలో ఆయన తీరుతో చుక్కలు కనపడుతున్నాయి. మరి ఈ విషయంలో బాబు తీరు ఎప్పటకి మారుతుందో ? చూడాలి.