టీడీపీకి ఇద్దరు ఎమ్మెల్సీలు గుడ్ బై..!
ఏపీలో అధికార టీడీపీకి అదిరిపోయే షాక్ తగలనుంది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు పార్టీ మారేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. నంద్యాలలో ఉప ఎన్నిక జరుగుతోన్న వేళ అక్కడ టీడీపీలో తీవ్ర అవమానాలకు గురవుతోన్న ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి వైసీపీలోకి వెళ్లిపోతున్నట్టు సమాచారం. ఆయన సోదరుడు శిల్పా చక్రపాణిరెడ్డి వైసీపీలోకి వెళ్లినా చక్రపాణిరెడ్డి మాత్రం టీడీపీలోనే కొనసాగుతున్నారు.
అయితే చక్రపాణిరెడ్డిని మాత్రం టీడీపీ వాళ్లు పక్కన పెట్టేస్తున్నారు. ప్రచారంలోను ఆయనకు గుర్తింపు లేదు. చంద్రబాబు వచ్చినా ఆయనకు పిలుపులు ఉండడం లేదు. ఆయన వైసీపీ ఎంట్రీకి ఇప్పటికే లైన్ క్లీయర్ అయ్యిందట. ఆయన పార్టీలో చేరితే వచ్చే ఎన్నికల్లో శ్రీశైలం ఎమ్మెల్యే సీటును జగన్ ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. ఉప ఎన్నిక నోటిఫికేషన్ రావడంతో జగన్ నంద్యాల ప్రచారానికి వెళ్లిన రోజే శిల్పా ఆ పార్టీలో చేరడం ఖాయంగా తెలుస్తోంది.
ఇక ప్రకాశం జిల్లాలో టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ కరణం బలరాం కూడా వైసీపీ ఎంట్రీకి రంగం సిద్ధమవుతోంది. ఇక్కడ వైసీపీ నుంచి గెలిచిన గొట్టిపాటి రవికుమార్ను టీడీపీలో చేర్చుకున్నప్పటి నుంచి తీవ్ర అసంతృప్తితో రగిలిపోతోన్న ఆయన తాజాగా జరిగిన కనిగిరి సమావేశంలో ఆయన మంత్రులు పరిటాల సునీత, సిద్ధా రాఘవరావు సాక్షిగానే పార్టీలో ఉండాలా ? వెళ్లాలా ? అని అల్టిమేటం జారీ చేశారు.
వచ్చే ఎన్నికల్లో కరణం కుమారుడు వెంకటేష్కు టిక్కెట్టు రాదని తేలిపోయింది. ఇక అద్దంకి టీడీపీ టిక్కెట్టు ఎలాగూ గొట్టిపాటి రవికుమార్దే. దీంతో అద్దంకిలో పదే పదే గొట్టిపాటితో వార్కు దిగుతోన్న ఆయన ఇక పార్టీ మారేందుకు తన పని స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ ఇద్దరు ఎమ్మెల్సీలు పార్టీలు మారితే టీడీపీకి దిమ్మతిరిగే షాకే అనుకోవాలి.